దేశంలో నిలకడగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. అప్డేట్స్ ఇవిగో!

దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3.56 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 16,299 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 19,431 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సంతోషించదగ్గ పరిణామం. మరో వైపు నిన్న 53 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,25,076కి తగ్గింది. 

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా, క్రియాశీల రేటు 0.28 శాతంగా, రికవరీ రేటు 98.53 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,07,29,46,593 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 25,75,389 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.  


India
Corona Virus
Updates

More Telugu News